మేము ఇప్పటికీ కడప కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తోంది: అనిత

  • కనిగిరిలో చిరాగ్ పాశ్వాన్ తో కలిసి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనిత
  • వైసీపీ హయాంలో దళితులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని వ్యాఖ్య
  • తనపై, ఎంఎస్ రాజుపై అట్రాసిటీ కేసులు పెట్టించారని మండిపాటు

వైసీపీ అధినేత జగన్ పై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్‌తో కలిసి అంబేద్కర్ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. 


అనంతరం ఆమె మాట్లాడుతూ... గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దళితులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని... దళిత నాయకురాలైన తనతో పాటు, ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై కూడా అక్రమంగా అట్రాసిటీ కేసులు పెట్టించారని అనిత మండిపడ్డారు. ఆ కేసుల నిమిత్తం నేటికీ తాము కడప కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 


అలాగే, సాధారణంగా అంబేద్కర్ విగ్రహాలు ఊరి చివరన ఉంటాయని... కానీ, కనిగిరి పట్టణ నడిబొడ్డున అన్ని వర్గాల ప్రజలు కలిసి విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఆరుగురు ప్రధానుల వద్ద పనిచేసిన ఘనత దివంగత నేత రామ్ విలాస్ పాశ్వాన్ ది అని కితాబునిచ్చారు.


ఇక కూటమిపై వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇస్తూ... నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో అందరికీ ‘రెడ్‌బుక్’ మాత్రమే కనిపిస్తోందని, కానీ ఆయన రాజ్యాంగాన్ని చేతబూని యాత్ర చేసిన విషయం ఎందుకు కనిపించడం లేదని హోంమంత్రి అనిత ప్రశ్నించారు.


Vangalapudi Anitha
Chirag Paswan
Nara Lokesh
YS Jagan Mohan Reddy
MS Raju
Ambedkar Statue Kanigiri
AP Home Minister
Red Book
Kadapa Court
YCP Government Criticism

More Telugu News